KCR and Jagan 
రాజకీయాలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి!

Meenakshi Gopinathan

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెల 7వ తేదీన ఫాం హౌజ్‌లో కింద పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైంది. ఈ గాయం వల్ల కేసీఆర్‌కు డిసెంబర్‌ 8వ తేదీన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనను పరామర్శించారు. జగన్‌ పరామర్శ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేయనున్నారు.

ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుండి బేగంపేట్ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌...అక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్‌ ఇంటికి చేరుకున్నారు. సీఎం జగన్‌ రాక సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కేసీఆర్‌ ఇంటికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా పుష్పగుచ్చం అందించి జగన్‌కు స్వాగతం పలికారు.

8 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో చికిత్స తర్వాత కేసీఆర్‌ హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.